అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ।। 12 ।।
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।
అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; పరం — సర్వోత్కృష్ట; బ్రహ్మ — బ్రహ్మం; పరం — సర్వోత్కృష్ట; ధామ — ధామము; పవిత్రం — పవిత్రం చేసే; పరమం — సర్వోత్కృష్ట; భవాన్ — నీవు; పురుషం — పురుషుడవు; శాశ్వతం — నిత్యమైన; దివ్యం — దివ్యమైన; ఆది-దేవం — ఆది దేవుడివి; అజమ్ — జన్మ రహితుడువి; విభుం — గొప్ప/మహిమగల; ఆహుః — (వారు) ప్రకటించారు; త్వం — నీవు; ఋషయః — ఋషులు; సర్వే — అందరూ; దేవ-ఋషిః-నారదః — దేవర్షి నారదుడు; తథా — మరియు; అసితః — అసితుడు; దేవలః — దేవలుడు; వ్యాసః — వ్యాసుడు; స్వయం — స్వయముగా; చ — మరియు; ఏవ — నిజముగా; బ్రవీషీ — నీవే ప్రకటిస్తున్నావు; మే — నాకు.
BG 10.12-13: అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
వేదశాస్త్రాల పై వ్యాఖ్యానం చేసేవారు, శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు సర్వోన్నత భగవానులు కారు అని చెప్తుంటారు. సర్వోత్కృష్ట అస్తిత్వము, ఒక నిర్గుణ, నిరాకార తత్త్వమని, అదే రూపములను తీసుకుని మరియు అవతారములుగా ప్రకటితమవుతుందని, అందుకే ఈ అవతారాలు భగవంతుని నుండి ఒక మెట్టు దూరమైనవనీ చెపుతుంటారు. కానీ, అర్జునుడు ఈ అభిప్రాయాలను త్రిప్పికోడుతూ, శ్రీ కృష్ణుడే తన సాకార రూపంలో, సర్వోన్నతమైన సర్వ కారణ కారకుడు అని చెప్తున్నాడు.
ఇంతకు పూర్వపు నాలుగు శ్లోకాలు విన్న తరువాత అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయి పట్ల సంపూర్ణ నమ్మకం కలిగింది; మరియు తనలో ఇప్పుడు కలిగిన దృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెప్తారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహాత్ములైన మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడు, అసితుడు, దేవలుడు, మరియు వ్యాసుడు వంటి వారు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు మరియు సర్వకారణ కారకుడు అని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక పద్యం ఉంది, అందులో ఎంతో మంది శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు.
నారద మహర్షి ఇలా అంటాడు: ‘శ్రీ కృష్ణుడు సర్వ జగత్తులకి సృష్టికర్త మరియు అందరి మదిలోని భావాలను ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరి దేవతల ప్రభువు.’ (శ్లోకం 68.2).
మార్కండేయ ముని ఇలా పేర్కొన్నాడు: ‘శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం మరియు నియమనిష్ఠల సారం. ఆయనే సమస్తమునకూ భూత-వర్తమాన-భవిష్యత్తు.’ (శ్లోకం 68.3)
భృగు మహర్షి ఇలా అన్నాడు: ‘ఆయన దేవ దేవుడు మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపము.’ (శ్లోకం 68.4).
వేద వ్యాస ఋషి ఇలా పేర్కొన్నాడు: ‘ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువు, నీవే ఇంద్రుడికి మరియు ఇతర దేవతలకి అధికారాన్ని/శక్తిని ప్రసాదించావు.’ (శ్లోకం 68.5).
అంగీర మహర్షి ఇలా అన్నాడు: ‘శ్రీ కృష్ణుడే సర్వ ప్రాణుల సృష్టికర్త. ముల్లోకాలు ఆయన ఉదరము యందే ఉన్నాయి. ఆయనే సర్వోత్కృష్ట భగవానుడు.’ (శ్లోకం 68.6).
మహాభారతంలోనే మరోచోట, అసిత మరియు దేవల మహర్షులు ఇలా ప్రకటించారు: ‘ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడు శ్రీకృష్ణుడు.’ (మహాభారత వనపర్వం 12.50).
ఈ మహోన్నతమైన ప్రామాణికమైన మహాత్ములని ఊటంకిస్తూ అర్జునుడు - ఇప్పుడు శ్రీ కృష్ణుడే, తానే సర్వ కారణ కారకుడను అని చెప్పటం ద్వారా - స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు అని అంటున్నాడు.