తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత ।
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ।। 10 ।।
తమ్ — అతనితో; ఉవాచ — పలికెను; హృషికేశః — శ్రీ కృష్ణుడు, మనోఇంద్రియములకు అధిపతి; ప్రహసన్ — మందహాసముతో; ఇవ — అలాగ; భారత — ధృతరాష్ట్రా, భరత వంశీయుడా; సేనయోః — సైన్యముల; ఉభయోః — రెంటిలో; మధ్యే — మధ్యలో; విశీదంతం — శోకంలో ఉన్న వానితో; ఇదం — ఈ యొక్క; వచః — వాక్యములు.
BG 2.10: ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరుసేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా, పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని, పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీ కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్నీ సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు.
మనకున్న అసంపూర్ణ అవగాహనతో, మనం, ఉన్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము - వాటిపై సణుగుతూ, అసంతృప్తితో ఉంటాము, వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది, మన దౌర్భాగ్యానికి వాటిని భాధ్యులుగా చూస్తాము. కానీ, భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్నీ కోణాలలో లోపాలే లేని, దోషరహిత మైనది, అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు. మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరిచేరతాయి. అవన్నీ, మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి, దోష రహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్ళటానికి, కూర్చబడ్డాయి. ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా, పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కుంటారు.
‘మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి, ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది’ (The snowflakes fall slowly to the ground, each flake in its proper place), అనేది ఒక ప్రఖ్యాత 'టావో' నానుడి. ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా, ఈ ప్రపంచపు రూపకల్పన, స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో, ఇది మనకు చక్కగా విశదీకరిస్తుంది.
భూకంపాలు, హరికేన్లు, తుఫానులు, వరదలు, మరియు టైఫూన్లు మెదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో ఛాందోగ్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటాన్ని నిరోధించడానికి భగవంతుడు ఉద్దేశ్యపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు. ఎప్పుడైతే జనులు అలసత్వం, నిర్లక్ష్యంతో ఉంటారో, ఒక సహజ విపత్తు సంభవిస్తుంది, ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకుని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది. ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది. కానీ, ఇక్కడ ఉదహరించిన పురోగతి బాహ్యమైన విలాసవస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు, అది ఎన్నో జీవితకాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వం.