నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.
BG 2.16: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.
Sign in to save your favorite verses.
Sign In
Navigate directly to the wisdom you seek
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.
భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా
సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)
క్షరం ప్రధానమమృతాక్షరం హరః
క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)
సంయుక్తమేతత్ క్షరమక్షరం చ
వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)
ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.
1. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).
2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.
3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.
ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చాయి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?
ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.
సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స
తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా
తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్
నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం
చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం
కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)
భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.