సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ।। 9 ।।
సుహృత్ — శ్రేయోభిలాషుల పట్ల; మిత్రా — మిత్రులు; అరి — శత్రువులు; ఉదాసీన — తటస్థుల యందు; మధ్య-స్థ — మధ్యస్థులు; ద్వేష్య — ఈర్శాపరులు; బంధుషు — బంధువులు; సాధుషు — సాధువులు; అపి — కూడా; చ — మరియు; పాపేషు — పాపులు; సమ-బుద్ధిః — సమానమైన భావము (ఒక్క లాగే చూసే); విశిష్యతే — సర్వశ్రేష్ఠమైనవాడు.
BG 6.9: శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడుగా పరిగణించబడుతాడు.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగున్న, ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులను సమ దృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా చాల స్థాయిల్లో ఉంటుంది:
ఒక స్థాయి దృష్టి ఇలా ఉంటుంది: ‘అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు, కాబట్టి భగవంతుని అంశలే.’ అందుకే వారందరూ సమానమే. ఈ ప్రకారంగా చాణక్య పండితుడు అన్నాడు, ‘ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః’ ‘నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు, కాబట్టి తనలాంటి వారిగానే చూస్తాడు.’
అంతకన్నా ఉన్నతమైన దృష్టి ఇది: ‘భగవంతుడు అందరిలో ఉన్నాడు, కాబట్టి అందరూ గౌరవింపబడతగిన వారే.’
అత్యున్నత స్థాయిలో, యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు: ‘ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే.’ జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాఙ్మయం పదే పదే పేర్కొంటున్నది: ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ (ఈశోపనిషత్తు 1) ‘చరాచర భూతములతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వము, ఆ భగవంతుని ప్రాదుర్భావమే (manifestation), దాని అంతటా ఆయన నిండి ఉంటాడు.’ ‘పురుష ఏవేదం సర్వం’ (పురుష సూక్తం, ఋగ్వేదం), ‘భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతిచోటా నిండి ఉన్నాడు, ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే.’ కాబట్టి, అత్యున్నత యోగి, ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉండి, హనుమంతుడు అంటాడు: ‘సీయా రామ మయ సబ జగ జానీ’ (రామచరితమానస్), ‘నేను ప్రతివారిలో సీతా రాముల ముఖాన్నే చూస్తాను.’ అని.
6.31వ శ్లోక వ్యాఖ్యానంలో ఈ వర్గాలు మరింత విశదంగా వివరించబడ్డాయి. ఈ మూడు వర్గాలను సూచిస్తూ, అందరు వ్యక్తుల పట్ల సమత్వ దృష్టి కలిగిన యోగి, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన యోగి కన్నా ఉన్నతమైనవాడు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. యోగ స్థితిని గురించి వివరించిన శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకం నుండి మొదలిడి, ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తున్నాడు.